🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 20 Jul, 2026 | Page: 1

సెంట్రింగ్ మాటున టేకు కలప అక్రమ రవాణా.. రూ.75 వేల విలువైన కలప స్వాధీనం

మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో సెంట్రింగ్ కలప మాటున అక్రమంగా టేకు కలప తరలిస్తున్న మినీ వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. సోమవారం కలమడుగు అటవీ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, TS 19 T 3770 నంబర్ గల అశోక్ లేలాండ్ మినీ వ్యాన్‌లో ఎలాంటి చెల్లుబాటు అయ్యే ట్రాన్సిట్ పర్మిట్ లేకుండా టేకు దూలాలు, టేకు ఫర్నిచర్, టేకు దుంగలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వాహనంతో పాటు సుమారు రూ.75 వేల విలువైన టేకు అటవీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని సంబంధిత అటవీ చట్టాల ప్రకారం అటవీ నేర కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, కలప మూలం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తనిఖీ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి మధుకర్, ఫారెస్ట్ బీట్ అధికారులు పోచయ్య, తన్వీర్‌తో పాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు.
ఇందన్‌పల్లి అటవీ రేంజ్ అధికారి జి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అటవీ సంపదను అక్రమంగా నరికివేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలపై శాఖ నిరంతరం కఠిన నిఘా కొనసాగిస్తోందని తెలిపారు. అటవీ నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కలప రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖకు తెలియజేసి అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home